న్యూఢిల్లీ/ముంబై/హైదరాబాద్, మే 3: కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేండ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ ఏడాది జోరుగా సాగాయి. అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలుదారుల సౌకర్యార్థం చాలామంది వ్యాపారులు తమ షోరూంలను త్వరగానే తెరిచారు. దీంతో మధ్యాహ్నం అమ్మకాలు కాస్త నెమ్మదించినా.. ఉదయం, రాత్రి వేళల్లో బాగా జరిగాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
గతంతో పోల్చితే ఈసారి 10 శాతం అమ్మకాలు పెరుగుతాయం టున్నారు. సాధారణ రోజుల్లో కంటే గంట, 2 గంట లు ఎక్కువగా దుకాణాలు తెరిచే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి రూ.15,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగి ఉండవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సైతం అంచనా వేసింది. చివరిసారిగా 2019లో రూ.10,000 కోట్ల విక్రయాలు జరిగాయని పేర్కొన్నది. 2019లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి విలువ రూ.35, 220గా ఉంటే, ఈసారి రూ.51,510గా ఉన్నది.
మార్చి నుంచి గమనిస్తే తులం బంగారం ధర రూ.5,000 తగ్గింది. ఇది కూడా కొనుగోళ్లను పెంచిందని ట్రేడర్లు చెప్తున్నారు. గత 10-15 రోజుల నుంచే మార్కెట్లో కొనుగొళ్ల సెంటిమెంట్ కనిపిస్తున్నదని, మంగళవారం ఒక్కరోజే 25-30 టన్నుల పసిడి అమ్మకాలు జరిగాయని అంచనా వేస్తున్నామని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి వైస్ చైర్మన్ శ్యామ్ మెహ్రా చెప్తున్నారు. తులం ధర రూ.55,000-58,000ల నుంచి రూ.50,500 స్థాయికి తగ్గడం కూడా అమ్మకాల పెరుగుదలకు కలిసొచ్చిందన్నారు. ఈసారి అక్షయ తృతీయ అమ్మకాలు బాగున్నాయని, నగల డిమాండ్కు కొత్త మైలురాయిగా నిలిచిపోగలదన్న విశ్వాసాన్ని కల్యాణ్ జ్యుయెల్లర్స్ ఈడీ రమేశ్ కల్యాణరామన్ వ్యక్తం చేశారు. పెట్టుబడి, ఆస్తిగా కూడా బంగారాన్ని కొనేవారు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదమని భావించే కస్టమర్ల కోసం వ్యాపారులు పెద్ద ఎత్తున ఆఫర్లనూ తెచ్చారు. కొనుగోలు పరిమాణాన్నిబట్టి లక్కీ డ్రాల ద్వారా బంగారం, నగలు, స్మార్ట్ఫోన్లు, ఎయిర్ కూలర్లు, గృహోపకరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లతోపాటు బంపర్ ఆఫర్లుగా కార్లు, ఇండ్లను సైతం బహుమతులుగా పెట్టారు. ఇక తమ యాప్లు, క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే అదనపు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు వస్తాయని ఎస్బీఐతోపాటు ఫోన్పేలూ ముందుకొచ్చాయి. విలువైన వస్తువులు కొనడానికీ ఇదే మంచిరోజు కావడంతో ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ విజయ్ సేల్స్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈఎంఐల సదుపాయాన్ని అందించాయి. ఇక తనిష్క్, క్యారెట్లేన్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టీబీజెడ్, జోయాలుక్కాస్, పీసీ చంద్ర, కల్యాణ్ జ్యుయెల్లర్స్ సైతం కస్టమర్లకు రాయితీలు, కానుకల్ని అందించాయి.