న్యూఢిల్లీ : (Disinvestment) ప్రతిష్ఠాత్మక ఎయిర్ ఇండియాను టాటాల చేతికి అప్పగించిన తర్వాత.. ప్రైవేటీకరణ, పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ, బీపీసీఎల్, ఐడీబీఐ బ్యాంకు, పవన్హంస్, నీలంచల్ ఇస్పాత్ నిగమ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి అర డజనుకు పైగా కంపెనీలను ప్రైవేటీకరించడానికి లేదా పెట్టుబడుల ఉపసంహరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను ప్రభుత్వ ఖజానాకు చేరవేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, యాక్సిస్ బ్యాంక్, ఎన్ఎండీసీ, హడ్కో మొదలైన వాటిలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.8,369 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇటీవల ఎయిరిండియా అమ్మకం ద్వారా దాదాపు రూ.18,000 కోట్లు వచ్చాయి. ఈ విధంగా ఇప్పటివరకు రూ.26,369 కోట్లు మాత్రమే సేకరించగలిగారు. అటువంటి పరిస్థితిలో రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఇంకా చాలా డబ్బును సేకరించాల్సి ఉన్నది.
వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ పని పూర్తవుతుందని కొన్ని నెలల క్రితం ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే చెప్పారు. బీపీసీఎల్తోపాటు ఈ ఏడాది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీఈఎంఎల్, పవన్ హన్స్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ వంటి సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే, రెండు పీఎస్యు బ్యాంకులు, ఒక బీమా సంస్థ కూడా ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది.
ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా గత ఏడాది అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం రూ.19, 499 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. 2017-18 అత్యధికంగా రూ.1,00,056 కోట్లను ప్రైవేటీకరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కొవిడ్ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు
నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
ఇమ్రాన్ఖాన్-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..