Billionaires | ప్రపంచవ్యాప్తంగా విశ్వమారి ఉధృత రూపం ప్రదర్శించినప్పుడు 2020,2021ల్లో భారీగా పెరిగిన కుబేరుల సంపద.. ఈ ఏడాది తద్భిన్నంగా తగ్గిపోతున్నది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దరిమిలా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వల్ల టాప్ బిలియనీర్ల వ్యక్తిగత సంపద కొడిగట్టుకుపోయింది. స్టాక్స్ భారీ పతనం కావడంతో అపర కుబేరుల సంపదలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు టాప్-10 నుంచి నిష్క్రమిస్తే, మరికొందరు టాప్-10లోకి వచ్చేశారు.
ఈ ఏడాది ముగిసే సరికి దాదాపుగా కుబేరుల వ్యక్తిగత టాప్-5 బిలియనీర్ల జాబితాలో బెర్నార్డ్ అర్నాల్ట్, ఎలన్మస్క్, గౌతం అదానీ, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ నిలిచారు. వీరిలో భారత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ మినహా మిగతా నలుగురి సంపద ఒకటి కాదు రెండు కాదు 262 బిలియన్ల డాలర్ల నికర సంపద ఆవిరైంది. గౌతం అదానీ వ్యక్తిగత సంపద 42 బిలియన్ డాలర్లు పెరిగి బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్లో 11 స్థానాలు పైపైకి దూసుకెళ్లింది.
సరిగ్గా ఏడాది క్రితం టాప్-5 బిలియనీర్ల జాబితాలో టెస్లా కం ట్విట్టర్ అధినేత ఎలన్మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్, లారీ పేజ్ నిలిచారు. లగ్జరీ బ్రాండ్స్ టు ఇంటర్నెట్ బేస్డ్ ఎల్లో పేజెస్ సర్వీస్, మైనింగ్ నుంచి భూతాప నివారణకు దోహదపడే గ్రీన్ ఎనర్జీ తయారీ వరకు పలు రంగాల్లో సేవలందిస్తున్న లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్.. ప్రపంచంలోనే అపర కుబేరుడిగా నిలిచారు. ఆయన వ్యక్తిగత సంపద 161 బిలియన్ డాలర్లు. గత ఏడాది కాలంలో ఆయన వ్యక్తిగత సంపద 10 బిలియన్ డాలర్లు కోల్పోయారు.
అదానీ గ్రూప్ చైర్మన్ కం ఫౌండర్ గౌతం అదానీ ఈ ఏడాది డార్క్హార్స్లా టాప్-5 కుబేరుల క్లబ్లో అనూహ్యంగా చేరిపోయారు. గూగుల్ కో-ఫౌండర్ లారీపేజ్ స్థానాన్ని గౌతం అదానీ భర్తీ చేశారు. లారీ పేజ్ వ్యక్తిగత సంపద 45.8 బిలియన్ డాలర్లు హరించుకుపోవడంతో టాప్-5 జాబితా నుంచి తప్పుకున్నారు.
సౌతాఫ్రికా సంతతికి చెందిన అమెరికన్ ఎలన్ మస్క్ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఫౌండర్, స్పేస్ ఎక్స్ అధినేత ఇప్పుడు ఆయన వ్యక్తిగత సంపద 140 బిలియన్ డాలర్లు. గత అక్టోబర్ నెలాఖరులో ట్విట్టర్ను టేకోవర్ చేసిన ఎలన్మస్క్ సంపద 134 బిలియన్ డాలర్లు పతనమైంది. ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన ఎలన్మస్క్ తీసుకున్న నిర్ణయాలు.. ఆ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకం అయ్యేలా చేశాయి.
గుజరాతీ వ్యాపార వేత్త గౌతం అదానీ ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో అపర కుబేరుడిగా నిలిచారు. ఏడాది కాలంలో 42 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద పెరిగింది. ఈ ఏడాది అపర కుబేరుల్లో వ్యక్తిగత సంపద పెంచుకున్న ఏకైక వ్యక్తి గౌతం అదానీ. ఈ నెల 19 నాటికి ఏడు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.55 లక్షల కోట్లు జత కలిశాయి.
అపరకుబేరుల్లో నాలుగో స్థానంలో ఉన్న అమెరికా వ్యాపారవేత్త బిల్గేట్స్ వ్యక్తిగత సంపద ఈ ఏడాది కాలంలో 28 బిలియన్ డాలర్లు ఆవిరైంది. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్… పేరొందిన దాతగా బిల్గేట్స్ వ్యక్తిగత సంపద 109 బిలియన్ డాలర్లు. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ వ్యవస్థాపకుడు-అపర కుబేరుల్లో ఐదో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద 107 బిలియన్ డాలర్లు. ఏడాది కాలంలో ఆయన 90 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు.