న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: అదానీ కంపెనీ షేర్లలో జరిగిన మోసాల్ని మార్కెట్ రెగ్యులేటర్ తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో తాజాగా ఒక అఫిడవిట్ దాఖలైంది. అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారి, కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, లా విద్యార్థి అనామికా జైస్వాల్లు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో&రెండు ఆరోపణలు మినహా మిగిలిన అన్నింటిపై తాము దర్యాప్తు పూర్తిచేశామని, అదానీ గ్రూప్లో పెట్టుబడిచేసిన విదేశీ ఫండ్స్ వాస్తవ యజమానులకు సంబంధించి ఐదు దేశాల నుంచి సమాచారం అందాల్సి ఉన్నదని ఆగస్టు 25న సుప్రీంకు సెబీ తెలిపింది.
వివాదానికి సంబంధించిన మొత్తం 24 అంశాల్లో 22 అంశాల్లో కనుగొన్నవి ‘ఫైనల్’ అని సెబీ సమర్పించిన స్టాటస్ రిపోర్ట్లో సుప్రీంకు నివేదించింది. ఈ నేపథ్యంలో అనామికా జైస్వాల్ సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ ఫైల్ చేశారు. వివరాలు&దిగుమతి చేసుకున్న విద్యుత్ పరికరాల విలువ ఎక్కువచేసి చూపించి (ఓవర్ ఇన్వాయిసింగ్), ఆ డబ్బుతో స్టాక్ మార్కెట్లో అదానీ తమ గ్రూప్ షేర్లను పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నదంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) 2014 లో అప్పటి సెబీ చైర్మన్కు లేఖ రాసారు.
ఆ లేఖతో పాటు రూ.2,320 కోట్ల మళ్లింపునకు సాక్ష్యంగా ఒక సీడీని సైతం డీఆర్ఐ జతచేసింది. తమ ముంబై జోనల్ కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లు పొందవచ్చని డీఆర్ఐ లేఖలో పేర్కొంది. ఇటువంటి ముఖ్య వాస్తవాల్ని సెబీ కోర్టు నుంచి దాచిపెట్టిందని, డీఆర్ఐ హెచ్చరికలపై నిద్రపోయిందని పిటిషనర్ ఆరోపించారు.
రెండు ఫండ్స్ భారీ ట్రేడింగ్
జర్నలిస్ట్ కన్సార్షియం ఓసీసీఆర్పీ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్లను పిటిషనర్ ప్రస్తావిస్తూ 2013-2018 మధ్యకాలంలో మారిషస్కు చెందిన ఎమర్జింగ్ ఇండియా ఫోకస్డ్ ఫండ్, ఈఎం రిసర్జంట్ ఫండ్లు అదానీ కంపెనీల్లో భారీ పరిమాణంలో ట్రేడ్ చేశాయని పేర్కొన్నారు. నియంత్రణలు, నిర్వచనాల్లో సెబీ తరచూ చేసిన సవరణలు అదానీకి ప్రయోజనం చేకూర్చాయని అఫిడవిట్లో ఆరోపించారు.
సెబీ కమిటీ సభ్యుడే అదానీ వియ్యంకుడు
అదానీ కేసును సెబీ దర్యాప్తునకు ప్రయోజన విరుద్ధమైన అంశం ఉందని పిటిషనర్ సుప్రీంకు తెలియపర్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి నేరాలను చూసే సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీలో సిరిల్ ష్రాఫ్ సభ్యుడు. చార్టర్డ్ అకౌంటింగ్ సంస్థ సిరిల్ అమర్చంద్ మంగళదాస్ మేనేజింగ్ పార్టనర్ అయిన ష్రాఫ్ కుమార్తె గౌతమ్ అదానీ కుమారుడ్ని పెండ్లి చేసుకున్నది. అదానీ, ష్రాఫ్ల మధ్య బంధుత్వం దర్యాప్తు ప్రయోజనానికి భంగం కల్గించేదని అఫిడ్విట్లో తెలిపారు. సెబీ దర్యాప్తును నిర్దేశించిన 24 అంశాల్లో ఐదు ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించినవే.