Red Sea | ముంబై, ఫిబ్రవరి 9: ఎర్ర సముద్ర మార్గంలో ఇంకా కొనసాగుతున్న అవాంతరాలు.. రవాణా ఖర్చుల్ని అంతకంతకూ ఎగదోసేలా ఉన్నాయని శుక్రవారం విడుదలైన ఓ నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున వాణిజ్య లావాదేవీలు జరిపే కార్పొరేట్లపై 25 నుంచి 30 శాతం వ్యయ భారం తప్పకపోవచ్చని అంచనా వేసింది.
అమ్మకాల నుంచి పొందే ఆదాయం, పంపిణీదారులకు చేసే చెల్లింపుల సమయం 15-20 రోజులు పెరుగుతుందని తమ తాజా రిపోర్టులో క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొన్నది. ఇది వ్యవసాయం, టెక్స్టైల్స్ వంటి రంగాలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఉక్కు, ఆటో, రసాయనాల రంగాల్లోకి కార్పొరేట్లను అప్పుల ఊబిలోకి నెట్టేలా కూడా తయారయ్యాయని ఇండియా రేటింగ్స్ కోర్ అనలిటికల్ గ్రూప్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి అన్నారు.