న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) ఎఫ్డీఐలు 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో భారత్లోకి 43.17 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
ఈక్విటీ మార్కెట్లోకి వచ్చిన ఎఫ్డీఐలు కలుపుకొని మొత్తంగా 55.27 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా..అంతక్రితంఏడాది ఇది 60.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత్లోకి వచ్చిన ఎఫ్డీఐల్లో సింగపూర్ నుంచి అత్యధికంగా 13 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాతి దేశాల్లో అమెరికా (5 బిలియన్ డాలర్లు), మారిషస్ (4.7 బిలియన్ డాలర్లు), యూఏఈ (3.1 బిలియన్ డాలర్లు), నెదర్లాండ్స్ (2.15 బిలియన్ డాలర్లు), జపాన్ (1.4 బిలియన్ డాలర్లు), సైప్రస్ (1.15 బిలియన్ డాలర్లు)ల నుంచి వచ్చాయని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగంలోకి అత్యధికంగా 8 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్డీఐలు వచ్చాయి. ఆ తర్వాత సేవలు (6.6 బిలియన్ డాలర్లు), ట్రేడింగ్ (4.14 బిలియన్ డాలర్లు), కెమికల్స్ (1.5 బిలియన్ డాలర్లు), ఆటోమొబైల్ ఇండస్ట్రీ (1.27 బిలియన్ డాలర్లు) వచ్చాయని పేర్కొంది.