Womens on Homes | భారతీయ భామలు బంగారం అంటే ప్రాణం పెడతారు. ఏమాత్రం వీలున్నా తమకు ఇష్టమైన ఆభరణాలు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. బంగారంతోపాటు ఈక్విటీ స్టాక్స్, లగ్జరీ ఫ్యాషన్పై పెట్టుబడులు పెట్టడానికి మొగ్గేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. 69 శాతం మంది ఇండ్లు, ఇండ్ల స్థలాలపై పెట్టుబడులు మదుపు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. టెక్ బేస్డ్ బ్రోకరేజ్ ఫ్రీ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ నోబ్రోకర్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ సంగతి చెప్పారు. కొన్నేండ్లుగా ఇండ్లు కొనుగోలు చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నది.
ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె నగరాల్లో 41 శాతం నగర శివారుల్లో చౌక ధరకు పెద్ద ఇండ్ల కొనుగోళ్లకు మొగ్గుతున్నారు మహిళలు. 50 శాతం మంది సిటీ లిమిట్స్లో, తొమ్మిది శాతం మంది సొంత పట్టణాల్లో ఇండ్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
94 శాతం మంది మహిళలు నివాస ఇండ్ల కొనుగోళ్ల కోసం చూస్తుంటే, ఆరు శాతం మంది మాత్రం కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారు. 73 శాతం మంది రూ.40-75 లక్షల్లోపు, రూ.కోటి లోపు విలువ గల ఇండ్లపై 20 శాతం, ఏడు శాతం మంది రూ.కోటి కంటే ఎక్కువ విలువ గల ఇండ్లపై ఇన్వెస్ట్కు ప్రియార్టీ ఇస్తున్నారు.
బెంగళూరులో 63 శాతం మంది సిద్ధంగా ఉన్న ఇండ్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. 37 శాతం నిర్మాణంలో ఉన్న ఇండ్లవైపు మొగ్గుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రజాదరణ పెరుగుతున్నది. ఆస్తుల కొనుగోలు పట్ల మహిళా కస్టమర్లలో పెరుగుతున్న మనోభావాలకు నిదర్శనంగా తమ సర్వే నిలుస్తుందని నో బ్రోకర్ డాట్కాం కో-ఫౌండర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌరబ్ గార్గ్ తెలిపారు.