(Year End Tasks) 2021 ముగియడానికి మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం చివరలో అంటే డిసెంబర్ 31న పూర్తిచేయాల్సిన కొన్ని టాస్క్లు ఉన్నాయి. వాటిని మనం ఎంతటి ఇబ్బందైనా పూర్తి చేయాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈ టాస్క్లలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం, పీఎఫ్ ఖాతాతో నామినీని లింక్ చేయడం వంటి ముఖ్యమైన పనులు ఉన్నాయి.
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ 31 లోపు దాఖలు చేయాలి. ఐటీఆర్ని సకాలంలో ఫైల్ చేయడం వల్ల వివిధ జరిమానాల నుంచి రక్షించుకోవడమే గాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. నిర్ణీత తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయనందున భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. నోటీసులు వస్తాయన్న భయం లేకుండా ముందుగానే ఐటీఆర్ దాఖలు చేసి నిశ్చింతగా ఉండాలి.
అన్ని పీఎఫ్ ఖాతాలకు నామినీని లింక్ చేయాలని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోరింది. నామినీలను జోడించడానికి 31 డిసెంబర్ గడువుగా నిర్ణయించారు. నిర్ణీత గడువులోకి పీఎఫ్ ఖాతాకు నామినీని లింక్ చేయకపోతే.. అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ని సందర్శించడం ద్వారా ఈ పనులను ఆన్లైన్లో పూర్తిచేయవచ్చు. ఒకవేళ ఈపీఎఫ్ సభ్యుడు మరణించిన పక్షంలో పీఎఫ్ డబ్బు, ఉద్యోగి పెన్షన్ పథకం, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలను సులభంగా పొందడంలో నామినేషన్ ప్రక్రియ సాయపడుతుంది. నామినీని ఆన్లైన్లో క్లెయింలను ఫైల్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.
మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ప్రకారం, డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31లోపు కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. కేవైసీ అందించకపోతే డీమ్యాట్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. దాంతో స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేయలేరు. షేర్లను కొనుగోలు చేసినప్పటికీ, ఆ షేర్లు వీరి ఖాతాకు బదిలీ అవవు. కేవైసీ పూర్తయి, ధ్రువీకరించబడిన తర్వాతనే కొన్న షేర్లు ఖాతాకు బదిలీ అవుతాయని మర్చిపోవద్దు.
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు గడువు తేదీ డిసెంబర్ 31. పింఛను కొనసాగింపునకు లైఫ్ సర్టిఫికెట్ అందజేయడం తప్పనిసరి. లేనిపక్షంలో 2022 జనవరి నుంచి బ్యాంకు ఖాతాలో పెన్షన్ జమ అవదు.
వార్షికాదాయం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్తో పాటు ఆడిట్ నివేదికను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్ట్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, సినిమా నటులు, లాయర్లు, టెక్నీషియన్లు వంటి నిపుణులు రూ.50 లక్షలకు మించిన ఆదాయంపై మాత్రమే ఆడిట్ రిపోర్టులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ దాఖలు చేయడానికి గడువు కూడా డిసెంబర్ 31.
పండుగ సీజన్లో బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించింది. కొత్త రుణం కాకుండా.. ఇతర బ్యాంకుల నుంచి బదిలీ చేసిన గృహ రుణాలపై కూడా కొత్త వడ్డీ రేటు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రయోజనం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. గృహరుణం తీసుకోవాలనుకునే వారు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేయడం ద్వారా ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..