న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ సంస్థను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) కీలక నిర్ణయం తీసుకున్నది. రూ.24,713 కోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆర్ఆర్వీఎల్ ప్రకటించింది. ఈ ఒప్పందంపై ఫ్యూచర్ రిటైల్కు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్ఆర్వీఎల్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మార్చి 31తో పూర్తికావలసిన ఈ ఒప్పందం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో ఫ్యూచర్ రిటైల్ వెల్లడించింది.
ఆర్ఐఎల్ పునర్వ్యవస్థీకరణకు ఓకే
మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో మరో ముందడుగు పడింది. మాతృ సంస్థ నుంచి ఓ2సీ (ఆయిల్ టు కెమికల్) వ్యాపారాలను కొత్త యూనిట్గా విభజించేందుకు వాటాదారులు, రుణదాతలు ఆమోదం తెలిపినట్లు ఆర్ఐఎల్ శుక్రవారం వెల్లడించింది. ఎన్సీఎల్టీ ఆదేశాల మేరకు వాటాదారులు, రుణదాతలతో వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించామని, ఓ2సీని ప్రత్యేక యూనిట్గా ఏర్పాటు చేసేందుకు 99.9% మంది ఓటు వేశారని ఆర్ఐఎల్ వివరించింది.
ఇవి కూడా చదవండి..