బీబీనగర్, జూలై 21 : బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని రాక్వుడ్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేష్ డీఈఓ భిక్షపతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, షూస్, సాక్స్ తదితర వస్తువులను తప్పనిసరిగా స్కూల్ నుంచే కొనుగోలు చేయాలని నిబంధనలు విధించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రవాణా సౌకర్యం పేరుతో అధిక బస్ ఛార్జీలు, ట్యూషన్ పేరుతో అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్వీ బీబీనగర్ మండలాధ్యక్షుడు పచ్చిమట్ల వంశీగౌడ్ ఉన్నారు.