దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామకమిటీలు మరింత పెంచాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం దమ్మపేట మండల పరిధిలోని తాటి సుబ్బన్నగూడెంలో ఎమ్మెల్యే నివాసం వద్ద గ్రామకమిటీ ఎన్నిక మండల పరిశీలకుల ఆధ్వర్యంలో జరిగింది.
తాటిసుబ్బన్నగూడెం గ్రామకమిటీ అధ్యక్షునిగా మాదాల నాగేశ్వరరావు, కార్యదర్శిగా తాటి నరేష్, మొద్దులగూడెం గ్రామకమిటీ అధ్యక్షునిగా దొడ్డా శ్రీనివాసరావు, కార్యదర్శి స్వర్ణాల శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామకమిటీల సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కోసమే సంస్థాగత నిర్మాణం జరుగుతుందని తద్వారా పార్టీ పటిష్టంగా మారుతుందన్నారు. గ్రామకమిటీలు ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి కృషిచేస్తూనే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వారికి వివరిస్తూ పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు.
గ్రామకమిటీల ఎన్నికను త్వరితగతిన పూర్తిచేయాలని పరిశీలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిశీలకులు నల్లబోతుల సత్యనారాయణ, బాణోతు రాముడు, గాదె లింగయ్య, ఎంఏ రసూల్, దారా బాబు, సంఘం రాఘవులు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఆత్మచైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, మండల కార్యదర్శి దొడ్డా రమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, మహబూబ్పాషా, నాయకులు ఎస్కె.బుడే, యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, ఎల్లిన రాఘవరావు తదితరులు పాల్గొన్నారు