భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు జరిపారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ కన్యాదానం, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక, మంగళాష్టకం కార్యక్రమాలతో రాములోరి నిత్య కల్యాణం జరిపించారు.