జైపూర్, జూలై 9 : ఇందారం, రామరావుపేట గ్రామాల్లో మేతకు వెళ్లిన ఆవులు, ఎడ్లను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, రాత్రివేళ వాటిని చంపి, గోదావరిఖని, బెల్లంపల్లి, మంచిర్యాల, రామకృష్ణాపూర్, జైపూర్ ప్రాంతాల్లో వన్యప్రాణుల మాంసంగా విక్రయిస్తున్న ముఠాను శుక్రవారం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి మండలం దుగ్నెపల్లికి చెందిన కుమ్మరి కల్యాణ్, జాడి సాగర్, మాల గురిజాలకు చెందిన దుగుట వెంకటస్వామి, జైపూర్ మండలం మిట్టపల్లికి చెందిన గద్దల రాజశేఖర్, ఇందారంకు చెందిన మాణుగ రజనీకాంత్, నస్పూర్ మండలం నస్పూర్గేట్కు చెందిన మహమ్మద్ షాకీర్, నస్పూర్కు చెందిన డీజే ఆపరేటర్ మేరడిగొండ అజయ్, గోదావరిఖనికి చెందిన జీలుమోడి కార్తీక్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు ఆటోలు, ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు జైపూర్ ఏసీపీ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ సంజీవ్తో కలిసి రామగుండం సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. ఆవులు, ఎడ్లు ఎత్తుకెళ్తున్నారన్న బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదులుపెట్టారన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇందారం ఐకే 1ఏ రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో ఆటో పెట్టి, సమీపంలో కట్టేసిన ఎద్దు వద్దకు కొందరు వెళ్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారని తెలిపారు. నిందితులు పోలీసులను గమనించి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. వారిని వెంబడించి పట్టుకొని విచారించగా, నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు.
ఆరు నెలల కాలంలో జైపూర్, నెన్నెల పోలీస్స్టేషన్లలో ఆవులు, ఎడ్ల దొంగతనం కేసులు ఆరు నమోదైనట్లు వెల్లడించారు. వారే ఆ నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. ఇందులో మాణుగ రజనీకాంత్, రామకృష్ణాపూర్ గద్దెరాగడి ప్రాంతానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్ దుప్పి మాంసంగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల రామకృష్ణాపూర్లో జరిగిన హత్యకేసులో ఎలిగేటి శ్రీనివాస్ జైలులో ఉన్నాడని తెలిపారు. మిగతా 8 మందిని కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఇందులో కుమ్మరి కల్యాణ్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, గతంలో అటవీ జంతువుల వేట, పశువుల దొంగతనం, గొడవలు, జైపూర్, తాళ్లగురిజాల, నెన్నెల, కన్నెపల్లి, బెల్లంపల్లి పోలీస్స్టేషన్లలో 19 కేసులు ఉన్నట్లు వివరించారు. సాగర్పైనా వివిధ పోలీస్స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్టు సీపీ చెప్పారు. ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించి, దొంగలను పట్టుకున్న ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది ఇజాజ్, శ్రీనివాస్, రాజశేఖర్, సుబ్బారావును సీపీ అభినందించారు.