అన్ని రంగాల్లో మండలాన్ని అగ్రగామిగా ఉంచండి
మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి, జూలై 13: అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో పనిచేయాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సూచించారు. మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు. వర్షాలు కురుస్తున్నందున వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూసుమంచి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు మొదలైనందున సర్పంచ్లు, కార్యదర్శులు పూర్తి బాధ్యత తీసుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పంటల సాగు గురించి అన్నదాతలకు వ్యవసాయ అధికారులు సూచనలివ్వాలన్నారు. మండలంలో ఇప్పటి వరకు 10 శాతం కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేయకపోవడానిక గల కారణాలను అడిగారు. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ బోధకాలు నివారణ మందులను పంపిణీ చేయాలన్నారు. కాగా, సర్వసభ్య సమావేశంలో మండలంలోని అనేక సమస్యలను సభ్యులు లేవనెత్తారు. వాటికి అధికారుల నుంచి సమాధానం రావాలని పట్టుబట్టారు. ఆత్మ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీడీవో కరుణాకర్రెడ్డి, సీడీపీవో బాలత్రిపురా సుందరి, డీటీ శ్రీనివాస్, ఏపీఎం సత్యవర్ధన్ రాజు, ఏపీవో అప్పారావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే ఈ నెల 15 నుంచి బోధకాలు నివారణ మందుల పంపిణీ చేసే బ్రోచర్ను ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి ఆవిష్కరించారు.