నుంచి ప్రగతికి శ్రీకారం పట్టనున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
పల్లె ప్రగతి నిర్వహణకు సర్వం సిద్ధం
ఖమ్మం, జూన్ 30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి):పల్లెల్లో ప్రగతి పరిమళాలు వెదజల్లుతున్నాయి. పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా మారాయి. నిరంతర పారిశుధ్య కార్యక్రమాలతో స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నాయి. ‘పల్లె, పట్టణ ప్రగతి’తో ఊహించని మార్పు జరిగింది. పల్లెల్లో పెండింగ్, అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతిలో చేపట్టనున్న పనులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
పరిసరాల పరిశుభ్రత పారిశుధ్య నిర్వహణ వంటి పనుల్లో గుణాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లె, పట్టణ ప్రగతి 4వ విడత కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రత విరాజిల్లేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో నిర్వహించాల్సిన పనులపై అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. 10 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో రోజువారీగా ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు గ్రామాల వారీగా సిద్ధం చేశారు.
తొలిరోజు గ్రామసభల నిర్వహణ
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో తొలిరోజు ఆయా గ్రామ, పట్టణ ప్రత్యేకాధికారి నేతృత్వంలో గ్రామసభ నిర్వహించడంతోపాటు కార్యక్రమ నిర్వహణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందంలో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఎలక్ట్రీసిటి లైన్మెన్, మిషన్భగీరథ, సాంకేతిక సహాయకులు ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్, మున్సిపల్ అధికారి, ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు ఉంటారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అత్యధికంగా పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు సహకరించకుండా వ్యర్థాలు, పెంట కుప్పులు రోడ్లపై వేయడం, పశువులకు, గొర్రెలను రోడ్లపై బాధ్యతరహితంగా వదలడం వంటి పనులు చేస్తున్నవారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రానున్నది వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వీధులను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు
గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామంతోపాటు ఆవాసాల్లో సైతం ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసి వాటిని సంరక్షించే బాధ్యతను కుటుంబసభ్యులకు అప్పగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామ ప్రత్యేకాధికారి తొలిరోజు పల్లె ప్రగతిలో ప్రగతి నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి పాదయాత్ర చేయాలని నిర్దేశించారు. గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. డ్రైనేజీ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఈ డ్రైడేలో పాల్గొననున్నారు. గ్రామాల్లో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకులను, పశువుల తొట్టెలను, నీటి తొట్టెలను శుభ్రపరచనున్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రపరిచే తేదీని నమోదు చేయాలని నిర్ణయించారు.
ప్రకృతి వనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టిసారించాలని నిర్ణయించారు. గ్రామం, పట్టణ ప్రాంతాల్లో పది రోజులు ప్రత్యేక ఏజెండాను తయారు చేసి రోజువారీగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి ఇంకుడుగుంతల నిర్మాణాలపై దృష్టిసారించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు. పారిశుధ్య నిర్వహణపై జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు దృష్టిసారించడంతోపాటు పల్లెనిద్ర చేయనున్నారు.