టీడీపీ అధినేత చంద్రబాబుపై టీటీడీ చైర్మన్, విశాఖ జిల్లా కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబుదే ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. చంద్రబాబు గద్దెనెక్కగానే హుద్ హుద్ తుపాను వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం జగన్ ఐరన్ లెగ్ అంటూ చంద్రబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైవీ సుబ్బారెడ్డి పై విధంగా కౌంటర్ ఇచ్చారు.
విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. మీ జీవితంలో ఎప్పుడైనా మంచి పనులు చేశారా? అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుదే ఐరన్ లెగ్ అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ కరోనా సమయంలో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూసుకున్నారని, మూడేళ్ల పాటు చంద్రబాబు లోకేశ్ నిద్రపోయారని, ఇప్పుడు మేల్కొన్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మూడేళ్లు నిద్రలో వుండి, ఇప్పుడు జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఏపీ ప్రజలు క్విట్ ఏపీ చంద్రబాబు.. క్విట్ మంగళగిరి అంటూ లోకేశ్ను తిప్పి పంపించారని వైవీ చురకలంటించారు. బాబు రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలిచ్చి, మోసం చేశారని, జగన్ పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇన్ని విమర్శలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.