YS Sharmila | విజన్ 2047 పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దశ – దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని తెలిపారు.
దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని.. పూర్తిగా అటకెక్కించారని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందన్నారు. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించిందని చెప్పారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరించిందని తెలిపారు. కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందపరించిందన్నారు. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయని.. ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గడిచిన పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని.. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని.. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవని వైఎస్ షర్మిల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైలు నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేదన్నారు. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ – దశ పూర్తిగా మారేది. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేదని అభిప్రాయపడ్డారు.
విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. రెండో ముద్దాయి చంద్రబాబు.. మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోదీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారని తెలిపారు. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. హోదాతోనే రాష్ట్రానికి విజన్ అని అన్నారు. మోదీ పిలక మీ చేతుల్లో ఉంది.. విభజన హామీలపై ప్రధానిని నిలదీయాలని చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించాలని కోరారు.