YS Sharmila | ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని విమర్శించారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన మోదీ వారసుడు అని మండిపడ్డారు. అలాంటి వాళ్లకు వైఎస్ఆర్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం పొరపాటే అని అన్నారు.
YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకమని వైఎస్ షర్మిల అన్నారు. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకమని తెలిపారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమని కొనియాడారు..
నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని మండిపడ్డారు.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని విమర్శించారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని.. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని.. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదని మండిపడ్డారు.
YSR తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే..అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోదీ వారసుడు జగన్ అని విమర్శించారు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం,ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటే అని వ్యాఖ్యానించారు. నాడు YCP ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపమని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో బకాయిలు ఎవరు పెట్టినా అవి విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.