YS Sharmila | ఏపీలోని ఏలూరులో పదో తరగతి బాలికపై జరిగిన అత్యాచారంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ పాలనపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రిగారూ.. మీ పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటుందని అన్నారు.
లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న.. మీకు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా అని షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో.. సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో సంచలనంగా మారిన ఆ ఘటనకు సంబంధించి హిందూస్థాన్ టైమ్స్లో ప్రచురితమైన వార్తకు సంబంధించిన క్లిప్ను ట్వీట్ చేశారు.
నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు
నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది
లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న… pic.twitter.com/qRzr0bUCsF— YS Sharmila (@realyssharmila) May 24, 2024
ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఓ బాలిక తన టెన్త్ మెమో కోసం ఈ నెల 15వ తేదీన పాఠశాలకు వెళ్లింది. అయితే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను అదే గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం (22), చంద్రశేఖర్ (22), తేజ(19), హరికృష్ణ (20) వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను బాలికకు చూపించి తమ కోరిక తీర్చాలని డిమాండ్ చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలని బాలిక తల్లిదండ్రులను కూడా బెదిరించారు.
ఆ వీడియో చూసి షాకైన బాధిత బాలిక తల్లిదండ్రులు రెండు లక్షల వరకు ఇస్తామని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోకుండా భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. చివరకు ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.