YS Sharmila | సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం.. పాలనలో పారదర్శతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు. రాజ్యాంగం తర్వాత ప్రాముఖ్యత దక్కింది ఒక్క RTIకి మాత్రమే అని తెలిపారు. ప్రభుత్వానికి జవాబుదారితనం, పౌరులకు సాధికారిత సమాచార హక్కు చట్టం కల్పించిన గొప్ప వరమని పేర్కొన్నారు. ఈ చట్టం విప్లవాత్మకం, దేశ పౌరులకు వజ్రాయుధమన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్ని అయినా పొందేందుకు 2005లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం చేస్తే.. నేడు మోదీ అదే హక్కుకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. సహా చట్టానికి దగ్గరుండి మరి సమాధి కట్టారని విమర్శించారు.
ప్రధాని మోదీ గద్దెనెక్కిన నాటి నుంచే సహా చట్టంపై పగబట్టారని వైఎస్ షర్మిల అన్నారు. సవరణల పేరుతో RTIను మేడిపండు చందంగా మార్చారని మండిపడ్డారు. వ్యక్తిగత సమాచారం సవరణ ముసుగులో మోదీ & కో అవినీతి బయటపడకుండా సవరించుకున్నారని అన్నారు. ఓట్ల చోరీ లాంటి దొంగపనులను వెలుగులోకి రానివ్వకుండా RTIను కట్టడి చేశారని విమర్శించారు. స్వయం ప్రతిపత్తిగా పని చేయకుండా సంకెళ్లు వేశారన్నారు. కేంద్ర సమాచార కమిషన్ కి చీఫ్ లేరు. కనీసం పూర్తిస్థాయిలో సభ్యుల నియామకం కూడా జరగలేదు. 2024 నాటికి దేశంలో ఉన్న 29 కమిషన్లలో పౌరులు పెట్టుకున్న 4 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే RTI ని ఎలా బంధించారో అర్థమైతుందని మండిపడ్డారు.
2019 సవరణలను వెంటనే రద్దు చేయాలనిRTI 20వ వార్షికోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కమిషన్ పదవి కాలాన్ని 5 ఏళ్లుగా మళ్లీ నిర్ణయించాలన్నారు. సమాచార కమిషనర్లు స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా పనిచేసే స్వేచ్ఛను పునరుద్ధరించాలన్నారు. కమీషన్ లో ఇద్దరు కాదు పూర్తి స్థాయిలో 11 మంది కమిషనర్ల నియామకం జరగాలని డిమాండ్ చేశారు. విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విజిల్ బ్లోయర్ల ప్రొటెక్షన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని.. వారికి రక్షణ కల్పించాలని కోరారు. జర్నలిస్టులు, మహిళలు, విద్యావేత్తలతో పాటు కమిషన్ లో అన్నివర్గాల ప్రతినిధులను నియమించాలన్నారు.