అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఊపిరిలాంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేయగా అందుకు జగన్ ప్రభుత్వం మౌనంగా ఉండడం మరింత దారుణమని పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. గురువారం విజయవాడలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు, రాజకీయ, కార్మిక, రైతు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ సంపదను బీజేపీ అదానీ(Adani) , అంబానీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. ఏపీలో గంగవరం పోర్టు భూములు ధారాదత్తం చేసి తక్కువ ధరకే అదానికి కట్టబెట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్ ను కూడా వారికే ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజలంతా గుర్తించాలని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న చంద్రబాబు, జగన్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంలో ఆఖరు స్థానంలో నిలుస్తోందని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా చంద్రబాబు, జగన్ వ్యవహరించారని మండిపడ్డారు.