అమరావతి : ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు ప్రారంభించనున్నారు. 27న ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పేర్కొన్నారు. రూట్ మ్యాప్పై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు.
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్రకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో కొనసాగుతుందన్నారు. ముందు కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభలో జగన్ మాట్లాడుతారని చెప్పారు. 28న నంద్యాలలో , 30న ఎమ్మిగనూరులో బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉంటాయని వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్(Notification) వచ్చే వరకు యాత్ర జరుగుతుంది. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు సజ్జల వెల్లడించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.