YS Jagan | లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేలులో ఇంటర్ కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని అన్నారు. ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందని జగన్ ఆరోపించారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ మీద కక్ష కొద్దీ తమ పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధిస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనంకాదా అని నిలదీశారు. దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకంచేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడనుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది.. ఆ వెంటనే పోలీసులు వారికి ఫోన్చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా?’ అని ప్రశ్నించారు దిశ’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబు అని మండిపడ్డారు.1.56కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశపై రాజకీయ కక్ష ఎందుకు అని ప్రశ్నించారు.
దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశామని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని తెలిపారు. 900 బైక్లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ను పటిష్ట పరిచామని పేర్కొన్నారు. 18 “దిశ’’ పోలీస్ స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చామని.. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశామని చెప్పారు. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లమని.. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారని అన్నారు. వీటన్నింటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారని అన్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదన్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని మండిపడ్డారు.