YS Jagan | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లెలో సోమవారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. త్వరలో జరుగబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావని.. ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్ను నిర్ణయించబోయేవన్నారు. జగన్కు ఓటేస్తేనే ప్రస్తుత పథకాలు కొనసాగుతాయని.. బాబుకు ఓటువేస్తే ముగింపేనన్నారు. బాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. సాధ్యం కాని హామీలను గుప్పించి మోసం చేస్తున్నారని.. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రజల దీవెనతో 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చామన్నారు. రూ.2.70లక్షల కోట్లు బటన్ నొక్కి, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. 2.31లక్షల కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం వైసీపీదేనన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా పేదవారికి గుర్తుకు రాదన్నారు. మళ్లీ బాబు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 2014 టీడీపీ మేనిఫెస్టోను చదివి వినిపించారు. హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించిన జగన్.. పొరపాటున మళ్లీ ఆయనకు ఓటేస్తే అప్పటి పరిస్థితులు వస్తాయని.. ప్రజలంతా ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు.