YS Sharmila | వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని వైసీపీ చేసిన ట్వీట్పై షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చి నిలదీయండి అంటే నేను చంద్రబాబుకు కొమ్ముకాసినట్లు ఉందా అని మండిపడ్డారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని ఎద్దేవా చేశారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని అన్నారు. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనబడుతున్నాడని విమర్శించారు.
మీ మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప.. ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ చేసిన విమర్శలపైనా షర్మిల సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది.. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందని స్పష్టం చేశారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని మండిపడ్డారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది.. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు.. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం! అని తెలిపారు.
వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే తానే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది తానేనని షర్మిల గుర్తు చేశారు. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
అసలు వైసీపీలో వైఎస్సార్ను, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో వైఎస్సార్ను ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారని విమర్శించారు. కాబట్టి వైఎస్సార్లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ అని మండిపడ్డారు.
మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని షర్మిల అన్నారు. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. 4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారని.. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారని.. మద్యపాన నిషేధం అని దగా చేశారని.. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా అని ప్రశ్నించారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టుపెట్టారని అన్నారు. మీ అహంకారమే మీ పతనానికి కారణమని తెలిపారు.