అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఏపీ పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఓటీఎస్ కింద డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఒకవైపు ఓటీఎస్ పథకం స్వచ్ఛందం అంటూనే మరోవైపు నిర్భందం, బలవంతం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఓటీఎస్ లక్ష్యాలను సాధించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ బెదిరించారని ఆరోపించారు. ఇండ్ల రిజిస్ట్రేషన్ల పేరిట పేదల నుంచి దాదాపు రూ.5వేల కోట్లను దోచుకునేందుకు ఓటీఎస్ను తీసుకొచ్చారని విమర్శించారు. 35 సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వాలు నిర్మించిన ఇండ్లకు డబ్బులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.