YS Sharmila | రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ అని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్పై ఎందుకు పెట్టలేక పోతున్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసింది.
అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు అని కూటమి ప్రభుత్వ నాయకులను వైఎస్ షర్మిల నిలదీశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. సెకీతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని అన్నారని.. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. గుజరాత్ లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారని అన్నారు. 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారన్నారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేయించారని గుర్తుచేశారు. అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారని.. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు అని నిలదీశారు.
అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు అని చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు. అంటే ఆనాడు జగన్ అదానీకి అమ్ముడు పోయారు.. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు అనే కదా అర్థమని ప్రశ్నించారు. మిమ్మల్ని కూడా తక్కెడలో అదానీ నిలబెట్టారు అనే కదా అర్థమని.. చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అదానీ మిమ్మల్ని కొనకపోతే, అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ACB ని మీ పంజరం నుంచి విడుదల చేయాలన్నారు. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని అన్నారు. తక్షణం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను రద్దు చేయాలన్నారు.