అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల బాధితులను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి, నెల్లూరు జిల్లాలో వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించారు. నెల్లూరులో భగత్సింగ్ కాలనీలో పర్యటించిన జగన్ బాధితులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందకపోతే ఈనెల 5వ తేదీలోగా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వరదల్లో కొట్టుకుపోయిన పెన్నానది బండ్ ఏర్పాటుకు రూ. 100కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు అఫ్రాన్కు 120కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పనులకు తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని, త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని జగన్ హామీ ఇచ్చారు.