తిరుమల : తిరుమలలో భక్తుల కోసం బోర్డు నిర్ణయం మేరకు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు తయారు చేస్తామని టీటీడీ ఈవో (TTD EO) ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో(Dial Your EO) కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు చెప్పారు.
అన్నప్రసాదం ముద్దగా ఉంటోందని, నాణ్యత పెంచాలని ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుకు ఆయన స్పందించారు. అన్నప్రసాద విభాగంలో రెండేళ్లుగా టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేస్తున్నామని, నాణ్యత తగ్గిందని గుర్తించామని అన్నారు. ప్రస్తుతం రైస్ మిల్లర్ల (Rice Millars) నుంచి బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, నిపుణులైన సిబ్బందిని తీసుకుని మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు తయారు చేస్తామని వెల్లడించారు.
అలిపిరి (Alipiri) నడక మార్గంలో చిరుతపులిల(Leopards) నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు ఫ్లైఓవర్ నిర్మించాలని మరో భక్తుడు కోరగా నడకదారి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని, అటవీ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వాలని అన్నారు. అటవీశాఖ సూచించిన మేరకు టీటీడీ తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. తిరుమలలో ఉచిత బస్సుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులను పెంచేందుకు ప్రయత్నిస్తామని ఈవో వివరించారు.
మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు డాక్టర్ సర్టిఫికెట్ తో వస్తే బయోమెట్రిక్ ద్వారా దర్శనానికి పంపుతామని తెలిపారు. లడ్డుల నాణ్యత పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. భక్తులపై అసభ్యంగా ప్రవర్తించే సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.