Vallabhaneni Vamsi | ఏపీలో సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంటే.. కృష్ణా జిల్లాలో మరో అసమ్మతి రాజకీయం మొదలైంది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. వాళ్లపై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో వల్లభనేని వంశీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
గుంటూరు జిల్లా వైకుంఠపురంలో ఇటీవల ఓ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు.. వల్లభనేని వంశీ, కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరికీ అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు అని ప్రశ్నించారు. వల్లభనేని ఆగడాలను ప్రశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని వారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేనికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగన్ను సైకో అని పేర్కొన్నట్టు కూడా ఆ వీడియోలో ఉంది. దీంతో వాళ్లపై వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనీపాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పంచాయతీకి కూడా గెలవలేని వాళ్లు.. తనకు సహకరించకపోతే ఏమీ కాదని విమర్శించారు. తనను, నానిని తిడితే పెద్ద వాళ్లం అవుతామని వాళ్లు భావిస్తున్నారని అన్నారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో కొడాలి నానికి, తనకు బాగా తెలుసని.. తమ గురించి ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతామని హెచ్చరించాడు. టీడీపీలో ఉన్నప్పుడు నాని, తాను ఎలా ఉన్నామో.. ఇప్పుడు వైసీపీలో కూడా తమ స్టైల్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. కళ్లు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేశ్ బాబు అనుకుంటే అయిపోతారా అని ఎద్దేవా చేశారు. అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి తాము మహేశ్ బాబులా ఉన్నామని అనుకుంటే అయిపోరని చమత్కరించారు. తాను గన్నవరానికి ఏం చేశానో తనకు.. అక్కడి ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.
ఇక తాము అక్రమంగా సంపాదించినట్టు దుట్టా, యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలపైనా వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. ఈ ఎదవలు అందరూ ఎలా సంపాదించారో.. తాను, కొడాలి నాని కూడా అలాగే సంపాదించినట్టు వంశీ చెప్పారు. వాళ్లలాగా గోనె సంచుల్లో మూటలు కట్టుకుని , కాటికి వెళ్లిన తర్వాత వాడుకోవాలని దాచుకోవడం లేదని విమర్శించారు. పది మందికి ఖర్చుపెడుతున్నామని తెలిపారు. తనతో కలిసి ప్రయాణం చేస్తే వాళ్ల అదృష్టం లేకపోతే వాళ్ల కర్మ అని అన్నారు. దుట్టా రామచంద్రరావు తనకు ఎప్పుడూ పనిచేయలేదని.. అతని కూతుర్ని గెలిపించింది తానేనని స్పష్టం చేశారు. దుట్టా కొడుక్కి, అల్లుడికి పనిచేయాలి కానీ.. అతను మాత్రం పార్టీకి ఏ పనిచేయడు అంటూ ధ్వజమెత్తారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై దుట్టా రామచంద్రరావు కూడా స్పందించారు. ఏపీ సీఎం జగన్ను తిట్టే మనస్తత్వం తమది కాదని తెలిపారు. అందరం సరదాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎవరు రికార్డు చేశారో తమకు తెలియదని చెప్పారు. ఆ వీడియోలో అనకూడని మాటలు ఏమీ లేవని చెప్పారు. వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేయనని చెప్పానని.. వంశీతో గొడవపడద్దని తనకు అధిష్ఠానం చెప్పిందని తెలిపారు. వారి మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. కొడాలి నాని ఏడో తరగతి తప్పిన వెధవ అని తాము అనలేదని.. అక్కడ ఉన్నవాళ్లు ఎవరో అంటే రికార్డు అయ్యిందని చెప్పుకొచ్చారు.
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు..