Kotamreddy Sridhar reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అధికార పార్టీపై ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి వైఎస్ జగన్ షాకిచ్చారు. నెల్లూరు గ్రామీణ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గం నుంచి కూడా ఆదాల పోటీ చేస్తారని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ను కలిసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సజ్జల ప్రకటించారు.
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన స్నేహితుడితో పర్సనల్గా మాట్లాడిన ఆడియో కాల్కు సంబంధించిన విషయాలను ఇంటెలిజిన్స్ చీఫ్ ఆంజనేయులు తనతో ప్రస్తావించారని తెలిపారు. తన కాల్ ట్యాప్ చేయకుండానే ఆ విషయాలు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. కాల్ ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలిసి మనస్తాపానికి గురయ్యానని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు.
అయితే కోటంరెడ్డి వ్యాఖ్యలను ఏపీ మంత్రులు పేర్ని నాని, బాలినేని, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు తప్పుబట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవమని కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. తన స్నేహితుడే కాల్ రికార్డును లీక్ చేసి ఉంటారని అన్నారు. ప్రభుత్వానికి ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడం తప్ప.. వేరే పని లేదా అని ప్రశ్నించారు. టీడీపీలో చేరదామని ఫిక్సయిన తర్వాతనే సానుభూతి కోసం ఇలా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా నెల్లూరు జిల్లాలో ఈ వివాదం ముదురుతుండటంతో ఏపీ సీఎం జగన్ దృష్టి సారించారు. సజ్జల, ఇతర వైసీపీ నేతలతో సమావేశం అనంతరం కోటంరెడ్డిని రూరల్ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు..