Phone Tapping | తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకేం పనులు లేవా అని ప్రశ్నించారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాతనే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి ఫోన్లు ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకేం పని లేదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానం వస్తే మూడు నెలల కిందటే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫోన్ వాడే వాళ్లలో చాలామంది కాల్స్ రికార్డు చేస్తూ ఉంటారని పేర్ని నాని అన్నారు. రికార్డు అయిన కాల్స్ సర్క్యులేట్ అవుతుంటే ఒకసారి చూసుకోమని చెప్పడం మామూలేనని తెలిపారు. ఏపీ సీఎం జగన్ గురించి ఎబ్బెట్టుగా మాట్లాడినట్టు ఆడియోలో ఉంది కాబట్టే కోటంరెడ్డికి పంపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆ మాత్రం దానికే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్యుప్మెంట్ కొననప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. వెళ్లిపోయే ముందు పార్టీపై బురద జల్లేందుకు ఏమైనా మాట్లాడొచ్చని విమర్శించారు. వైసీపీని వీడే ముందు సానుభూతి కోసమే కోటంరెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ ఎవరికీ పట్టలేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటి దరిద్రపు అలవాట్లు చంద్రబాబుకే ఉన్నాయని విమర్శించారు. పార్టీ మారాలని అనుకున్నాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే కోటంరెడ్డి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. నాలాంటి అనామకుడికే జగన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చారని కోటంరెడ్డి వెయ్యిసార్లు చెప్పారు.. కానీ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవి రాదేమోననే అనుమానంతోనే టీడీపీలో చేరుతున్నాడని విమర్శించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఎంతోమందికి జగన్ మంత్రి పదవులు ఇవ్వలేదని తెలిపారు. సామాజిక సమీకరణాల ప్రకారమే అన్ని వర్గాల వారికి జగన్ పదవులు ఇచ్చారని స్పష్టం చేశారు.
కోటంరెడ్డితో పాటు ఎవరు పార్టీ వీడినా పార్టీకి నష్టం లేదని మంత్రి కాకాణి అన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకునే కోటంరెడ్డి బయటకు వెళ్లిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. అది కేవలం కాల్ రికార్డు మాత్రమేనని స్పష్టంచేశారు. కోటంరెడ్డి సోదరుల అవినీతిపై అవసరమైతే విచారణ చేయిస్తామని తెలిపారు.
ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి రికార్డు చేస్తే అది ట్యాపింగ్ అవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఫోన్లలో అనేక యాప్లు ఉంటాయని.. వాటి ద్వారా ఎవరో ఒకరు రికార్డు చేస్తే అది ట్యాపింగ్ కాదని తెలిపారు. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ బయటకు వచ్చిందంటే ఎవరో ఒకరు రికార్డు చేసింది అయ్యి ఉంటుందని ఆయన చెప్పారు. దాన్ని ప్రభుత్వంపై రుద్ది రాద్ధాంతం చేయడం మంచిది కాదని హితవు పలికారు.
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు..