Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai reddy) తెలియజేశారు. ఇవాళ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్లు చాలా అద్బుతంగా చికిత్సనందిస్తున్నారు. తారకరత్నకు గుండె పోటు వచ్చిన రోజు 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయింది. ఈ కారణంగా మెదడుపై భాగం దెబ్బతిన్నది.
రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల కొంత వాపు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెదడు పనితీరు కొద్దిగా తగ్గింది.వాపుకు సంబంధించిన ప్రోగ్రెషన్ మూడు, నాలుగు రోజుల వరకుంటుంది. డాక్టర్లు చెప్పిన టైం నేటితో ముగుస్తుంది కాబట్టి.. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం తారకరత్న గుండె పనితీరు మెరుగుగా ఉంది. రక్తప్రసరణ బాగుంది.
లివర్తోపాటు కొన్ని మిగిలిన అవయవాల పనితీరు కొంత తగ్గింది. నందమూరి బాలకృష్ణ వైద్య సదుపాయానికి సంబంధించిన విషయాలను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డి భార్య సోదరి కూతురు.
ఇటీవలే కుప్పం నియోజక వర్గ కేంద్రం నుంచి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురవగా.. వెంటనే కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తారకరత్నను డాక్లర్ల బృందం అర్థరాత్రి గంటన్నర సమయంలోనే తారకరత్నను హుటాహుటిన బెంగళూరుకు తరలించి చికిత్స కొనసాగిస్తోంది.