Srisailam | ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభం అవుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను సిద్దం చేసినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. తెల్లవారుజాము నుండి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం ఆలయ ప్రోక్షణ సమయం మినహా అర్థరాత్రి వరకు భక్తులను అనుమతిస్తున్నట్లు ఈవో పెద్ది రాజు చెప్పారు.
స్వామి అమ్మవార్లకు నిత్యకళ్యాణోత్సవం, ఏకాంతసేవ మినహా నిత్యం జరిగే ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష హోమ అభిషేక సేవలు నిలిపివేశారు. వివిధ రాష్ట్రాల నుండి యాత్రికులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటుండటంతో ప్రతిరోజు వేల మందికి పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా యాత్రికులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, పార్కింగ్, శానిటేషన్, సూచికబోర్డులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంచినీటి సరఫరా, వైద్యసేవలు, అన్నప్రసాద వితరణ శిబిరాల వద్ద మోలిక వసతులు కల్పించి పర్యవేక్షిస్తున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు.
ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తుపూజ, హోమం, మండపారాధన, కళశస్థాపన, రుద్రహోమం, రుద్రపారాయణలతోపాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణ ప్రత్యేక పూజలు, చండీహొమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఈవో డీ పెద్ది రాజు తెలిపారు. సాయంత్రం అంకురార్పణ, జపానుష్టాన ప్రత్యేక పూజల అనంతరం అలంకార మండపంలో భృంగి వాహనంపై ఆసీనులైన ఆదిదంపతులకు షోడశోపచార క్రతువులు నిర్వహిస్తారు. అనంతరం గ్రామోత్సవంలో మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.