Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం ఈఓ డీ పెద్దిరాజు దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేశారు. దీంతో ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
లోక కళ్యాణం కోసం వేద పండితులు శివసంకల్పాన్ని పఠించారు. అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు కోరారు. గణపతిపూజ అఖండ దీపరాధన, కళశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యహ్వచనం,చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కళశ స్థాపన, కంకణపూజ, కంకణధారణ జరిపించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని తీసుకుని తొమ్మిది పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా చేశారు.
సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను భృంగి వాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. భృంగి వాహానాధీశులైన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వలన పనులలో ఏకాగ్రత లభించి, సర్వపాపాలు హరించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి.
కన్నడిగుల ఇలవేల్పు, ఇంటి ఆడపడుచైన శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలు నిర్వహించారు. చతుర్బుజాలు కలిగిన ఈదేవి పై రెండు చేతులల్లో పద్మాలు, కుడివైపు అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో భక్తాధులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వలన శత్రుభాధలు నివారించబడి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, నందిమండపం నుండి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతో పాటు ఈఈ రామకృష్ణ, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, ఏఈఓలు హరిదాస్, ఫణిధర్ ప్రసాద్, మల్లికార్జున రెడ్డి,సూపరింటెండెంట్ రవి కుమార్, వెంకటేష్, మధుసూదన్ రెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లు, మహాదుర్గ అలంకారంలో శ్రీశైల భ్రామరి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.