Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు. ఉగాది మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ విభాగాలు, శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటకలోని పలు ప్రాంతాలు, మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరుగకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దేవస్థానానికి వచ్చే భక్తులతో మర్యాదగా మెలగాలని, ప్రతి భక్తుడిని ఒక అతిథిగా భావించాలని సిబ్బందికి సూచించారు. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం అవుతున్నా, వారం ముందు నుంచే క్షేత్రానికి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. కనుక ఈ నెల 29 నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తగిన కార్యాచరణ ప్రణాళికలతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఉగాది మహోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు జరిగే కైంకర్యాల్లో ఎటువంటి లోపం లేకుండా పరిపూర్ణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైదిక సిబ్బందికి పెద్దిరాజు సూచించారు. ఉత్సవ పూజాదికాలు కూడా నిర్దేశిత సమయానికి ప్రారంభించాలని పేర్కొన్నారు.
ఉగాది మహోత్సవాలకు భక్తులు కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామెర్ల కుంట్ల, పెద్ద చెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా క్షేత్రానికి చేరుకుంటారని ఈఓ పెద్ది రాజు చెప్పారు. కనుక కాలిబాట మార్గంలో తగిన వసతులు కల్పించాలని సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా కాలిబాట మార్గంలో భక్తులకు మంచినీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే కైలాస ద్వారం వద్ద అదనపు మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. కైలాస ద్వారం, భీముని కొలను మార్గంలో సింటెక్స్ ట్యాంకులు నెలకొల్పి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలన్నీ ఉగాది ఉత్సవాల్లో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాస ద్వారంతోపాటు క్షేత్రంలో భక్తులు బస చేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక దర్శనం క్యూలైన్లలో నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు.
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెద్దచెరువు, కైలాసద్వారం తదితర ప్రాంతాలతోపాటు శ్రీశైల క్షేత్ర పరిధిలో భక్తులకు అన్నదానం చేస్తున్న దాతలకు దేవస్థానం అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. ఉత్సవాల్లో క్షేత్ర పరిధిలోనూ పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని, ఆ అన్నదానం బ్రుందాలకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్, అన్న ప్రసాద వితరణ విభాగాలను ఆదేశించారు. ముఖ్యంగా అన్నదాన ప్రాంతాల్లో పైప్ పెండాల్స్, లైటింగ్తోపాటు మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు.
క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్ఫాహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నదాన, ఆలయం అండ్ క్యూల నిర్వహణ విభాగాలను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. క్యా కాంప్లెక్సు, క్యూలైన్లలో అదనపు ఫ్యాన్లతోపాటు అవసరమైన చోట కూలర్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే భక్తులు సేద తీరడానికి ఉగాది మహోత్సవాల్లో కూడా పలుచోట్ల షామియానాలు, పైపు పెండాల్స్ (చలువ పందిళ్లు) వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. చలువ పందిళ్లు వేసిన అన్ని ప్రాంతాల్లో తగిన విద్యుద్ధీకరణ ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు మంచినీటి సరఫరా చేయాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం అంతటా పలు ఆరు బయలు ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దేవస్థానం అతిథి గ్రుహాల ప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతి ప్రదేశాల్లో వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు చేయాలని ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్వచ్చంద సేవకుల సహకారం తీసుకోవాలని పీఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్చంద సేవకులకు నిర్ణీత వేళల్లో షిఫ్టులు నిర్ణయించి, తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులు అందజేయాలని చెప్పారు.
లక్షలాది మంది భక్తులు వస్తున్నందున దేవస్థానం దవాఖానలో అవసరమైన మేరకు ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని దవాఖాన వైద్య సిబ్బందిని ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. గుండె జబ్బులు తదితరాలకు అవసరమైన అత్యవసర మందులు, కాలి నడకన వచ్చే భక్తులకు బొబ్బల నుంచి ఉపశమనం కోసం ఆయింట్ మెంట్ మందులు, అవసరమైన సూది మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. క్షేత్ర పరిధిలోనూ, కైలాస ద్వారం తదితర చోట్ల జిల్లా వైద్యశాఖ సహకారంతో తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య విభాగ సహాయ ఈఓను పెద్దిరాజు ఆదేశించారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే ఉగాది మహోత్సవాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈఓ పెద్దిరాజు చెప్పారు. పారిశుద్ధ్య పనులకు దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితోపాటు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగం సహాయ కార్యనిర్వహణాధికారిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారం తొలగింపునకు అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. క్షేత్ర పరిధిలో పలు చోట్ల గల శాశ్వత మరుగు దొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ‘స్వచ్ఛ శ్రీశైలం’లో భాగంగా క్షేత్ర పరిధిలో బహిరంగ మల మూత్ర విసర్జనను నిషేధించిన విషయమై పలు చోట్ల సూచిక బోర్డులతో భక్తులకు అవగాహన కల్పించాలని చెప్పారు. భక్తులకు సమాచారం తెలిపేందుకు అన్ని చోట్ల కన్నడ భాషలోనూ విస్తృతంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్, శ్రీశైల ప్రభ విభాగాలను ఆదేశించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మాదిరిగానే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని ఈఓ పెద్దిరాజు చెప్పారు. ఉత్సవాల్లో భక్తులను ఆలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కన్నడ భక్తి సంగీత విభావరి, కన్నడ ప్రవచనాలు, కన్నడ భక్తి నాటకాలు కూడా ఏర్పాటు చేయాలని పీఆర్ఓను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నంది సర్కిల్, కల్యాణ కట్ట, పాతాళ గంగ మెట్ల మార్గం, సాక్షి గణపతి, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, యజ్ఞ వాటిక, దేవస్థానం వైద్య శాల తదితర ప్రాంతాల్లో తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమాచార కేంద్రాల్లోనూ కన్నడ ప్రాంత స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకోవాలని, వారి సహకారంతో భక్తులకు తగిన సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్ గుర్రప్ప, సర్కిల్ ఇన్స్ పెక్టర్ రమేశ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, గంగయ్యయాదవ్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఆయూబ్ ఖాన్, మండల పీహెచ్సీ వైద్యురాలు శ్రీవాని, దేవస్థానం దవాఖానలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డాక్టర్ శ్రావణ్, దేవస్థానంలోని అన్ని విభాగాల, యూనిట్ల అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.