సంక్రాంతి పండుగ వేళ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అనుమానాస్పదంగా మృతిచెందారు. పండుగకు ఇంటికొచ్చిన యువకులు పార్టీ చేసుకోగా.. ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారు కన్నుమూశారు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నై, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం బండవడ్డిపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మణికుమార్ (35), పుష్పరాజ్ (26) సంక్రాంతి పండుగకు ఊరికి వచ్చారు. పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ పోటీపడి మద్యం సేవించారు. దీంతో ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్నేహితులు వారిని ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలోనే మృతిచెందారు. మణికుమార్కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉండగా.. పుష్పరాజ్కు ఇంకా పెళ్లి కాలేదు.
పండుగ సమయంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కల్తీ మద్యం కారణంగానే వారు మరణించారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే అతిగా మద్యం సేవించడం వల్లే వారు మరణించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఇద్దరూ కలిసి మొత్ం 19 బడ్వైజర్ టిన్ బీర్లు తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడంతో తీవ్ర డీహైడ్రేషన్కు గురయ్యారని.. దీంతో ఇద్దరి పరిస్థితి విషమించిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలోనూ అతిగా మద్యం సేవించడమే కారణమని స్పష్టమైందని పేర్కొన్నారు.