TTD | తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు క్రియేట్ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీలో గతంలో చాలామంది నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ROR) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కొరకు కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులను తీసుకోగా.. జీవో నెంబర్ 114 ప్రకారం నిబంధనలు సడలించి సేవలు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు.
టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్టల్స్ నిర్మాణానికి అంగీకరించారు. రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పీఏసీ-1లో 10 లిఫ్టులు ఏర్పాటుకు కోసం టెండర్లు పిలిచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.1.50 కోట్లతో బాలాజీనగర్ తూర్పు వైపున, పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. రూ.14కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సీ టైప్, డీ టైప్, కొత్త సీ టైప్, డీ టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు బోర్డు ఆమోదం చెప్పింది.
తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థసారథిస్వామి, కల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఐటీ సేవల కోసం టైర్-3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకోసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులోభాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసం రూ.12 కోట్లు మంజూరుకు ఆమోదం ఆమోదం తెలిపింది.
టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలన అనుమతించింది. ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.