అమరావతి : టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధికారులు , స్టాండింగ్ కౌన్సిల్స్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అక్టోబర్ 15వ తేదీలోపు అన్ని కేసుల కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసు ప్రాధాన్యతను నిర్ణయించుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించి విభాగాధిపతులు పూర్తి సమాచారంతో పేరావైజ్ రిమార్క్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రతి కేసు ఎప్పటిలోగా ఎలా పరిష్కరించుకోవచ్చో చర్చించుకోవాలని ఈవో చెప్పారు. దేవస్థానం న్యాయవిభాగం అధికారులు రెండు నెలలకోసారి స్టాండింగ్ కౌన్సిల్స్తో సమీక్ష జరపాలని, దీంతో ఎన్నో క్లిష్టమైన కేసుల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందన్నారు. ప్రతి స్టాండింగ్ కౌన్సిల్ తమకు అప్పగించిన కేసుల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జేఈవో సదా భార్గవి, వీరబ్రహ్మం, దేవస్థానం న్యాయాధికారి రెడ్డెప్ప రెడ్డి, డిప్యూటీ డీఎల్వో శ్యామ సుందర్ రెడ్డి, అసిస్టెంట్ లా ఆఫీసర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్స్ ఎస్ఎస్ ప్రసాద్ , సింధు కుమారి, ప్రశాంత్, సుమంత్, ప్రభాకర శర్మ, అనూప్ కౌశిక్ పాల్గొన్నారు.