అమరావతి : ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Family Suicide) చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తల్లి పద్మావతి,కుమార్తె వినయ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఒంటిమిట్ట చెరువు పక్కనే రైలు కిందపడి పద్మావతి భర్త సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు.
సుబ్బారావుకు చెందిన మూడెకరాల పొలం అమ్మడానికి ప్రయత్నించగా రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. పొలం శ్రావణి పేరుతో రికార్డులో ఉందని రెవెన్యూ అధికారులు వెల్లడించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నామని కుటుంబ సభ్యులు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. పోలీసులు కేసు (Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.