అమరావతి : ఎంతో ఉత్సాహంగా ఉగాది (Ugadi) పండుగను జరుపుకుంటున్న గ్రామంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. కర్నూలు (Kurnool) జిల్లా చిన్నటేకూరులో గురువారం ఉగాది వేడులను జరుపు కుంటున్నారు. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు అందరూ ఆలయం వద్ద గూమి కూడారు. ఎప్పటిలాగే ఉగాది వేడుకల్లో ఆనవాయితీగా వస్తున్న రథోత్సవం ప్రారంభమయ్యింది.
రథాన్ని లాగుతుండగా తీగలకు తగిలి రథం విద్యుదాఘానికి గురయింది. దీంతో పలువురుపెద్దలు, 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షాక్కు గురైన పిల్లలు రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.