Tirumala | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు ఇక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ తిరుమలను దట్టమైన పొగ కమ్మేసింది. శ్రీవారి సన్నిధితో పాటు ఆలయ పరిసరాలు అన్నీ మంచు దుప్పటి కప్పేసినట్లుగా మారింది.
అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే అప్రమత్తమైన టీటీడీ.. ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భారీ వర్షాలతో పాటు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మంగళవారం నాడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని ప్రకటించింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 48 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందన్నారు.
అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలనీ, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ విద్యుత్ అంతరాయ పరిస్థితిల్లో జనరేటర్లు నడిపేందుకు ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషియల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.