నమస్తేతెలంగాణ న్యూస్నెట్వర్క్, జూన్ 1: తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన నెమ్మది వెంకటమ్మకు ముగ్గురు కుమారులు వెంకన్న, రాంబాబు, అశోక్, కూతురు రేణుక ఉన్నారు. పెద్దకుమారుడు వెంకన్న ఇద్దరి కూతుళ్ల్లు బాన్వత అక్షర, సమన్వత అక్షరతో కలిసి వెంకటమ్మ తన కూతురి కుమారుడు దేవాన్ష్కు తిరుపతిలో పుట్టువెంట్రుకలు తీసి మొక్కులు చెల్లించేందుకు రెండు కార్లలో మంగళవారం సాయంత్రం బయల్దేరారు.
ఒక కారులో రేణుక కుటుంబ సభ్యు లు, మరో కారులో వెంకటమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు. తిరుమలలో మొక్కులు చెల్లించుకొని గు రువారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి వెళ్లే మా ర్గంలో ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద రాంబాబు నడుపుతున్న కారు ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వెంకటమ్మ (60), అశోక్ (32), సమన్వత అక్షర (5) అక్కడికక్కడే మృతిచెందగా వెంకన్న, రాంబాబు, బాన్వత అక్షరకు తీవ్రగాయాలయ్యాయి. కాగా రాంబాబు భార్య సంధ్య గర్భిణి కాగా వెంకన్న భార్య జ్యోతి అనారోగ్య పరిస్థితుల వల్ల వారు తిరుమలకు వెళ్లలేకపోయారు. పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తామని చెప్పి ఇలా అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. వెంకన్న, రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయులు
ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. వైరా మండలం విప్పలమడకకు చెందిన పారుపల్లి రాజేశ్ (38) హైదరాబాద్లోని ప్రగతినగర్లో ఉంటూ ఓ ప్రముఖ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య సుజాత(35), కుమారులు అశ్విత్ (8), దివ్యజిత్ ఉన్నారు. బుధవారం రాత్రి కుటుంబంతో కలిసి కారులో స్వస్థలానికి బయల్దేరాడు. గురువారం తెల్లవారుజామున కారు కొణిజర్లకు చేరుకుంటున్న క్రమంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్కు ఎదురుగా రోడ్డు పక్కన నిలిపిన ఆయిల్ ట్యాంకర్ కనిపించింది. దీంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుకే వస్తున్న రాజేశ్ కూడా బ్రేక్ వేశాడు. కారు వెళ్లి లారీని ఢీకొడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ కారును ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న నలుగురు అందులోనే ఇరుక్కుపోయారు.
స్థానికులు, 108 సిబ్బంది గంటపాటు శ్రమించి వారిని బయటకు తీశారు. అప్పటికే రాజేశ్, సుజాత, అశ్విత్ ప్రాణాలొదిలారు. దివ్యజిత్కు తీవ్ర గాయాలు కాగా ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే పెనుబల్లి మండలం వీఎం బంజరలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రెండు లారీల డ్రైవర్లు బీహార్కు చెందిన ధర్మేందర్ కుమార్ (29), మహారాష్ట్రకు చెందిన సంతోష్ జయరాం మాడవి (43) మృతిచెందారు. తల్లాడ మండలం రంగంబంజర వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న కల్లూరుకు చెందిన చింతలపల్లి సాయితేజ(14) మరణించాడు.