Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరానంటుతున్నాయి. మూడవ రోజు సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగినట్లు ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా ప్రభోత్సవం జరిగింది. ప్రభను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
ఆలయ ప్రాంగణం నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో మంగళవాయిద్యాలతో గంగాధర మండపం వద్దకు తీసుకొని వచ్చి ప్రభపై అధిష్టింపజేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో ఉన్న కన్నడ భక్తులు ప్రభను తిలకించేందుకు పురు వీధుల్లోకి తరలివచ్చారు. కన్నడ భక్తజనం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కీర్తిస్తూ ప్రభోత్సవంలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను నంది వాహనంపై ఆశీనులను గావించి షోడషోపచార ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందివాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వల్ల చేపట్టిన పనులు విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని ఇతిహసాలు చెబుతున్నాయి.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశైల శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించింది. చతుర్బుజాలు కలిగిన ఈదేవి వీణ, అక్షమాల, పుస్తకాన్ని ధరించి భక్తాధులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వల్ల విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుండి నందిమండపం మీదుగా బయలు వీరభద్రస్వామి వరకు జరిగిన గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది.