thiruchanur | తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించనున్నారు.
ఏటా అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా మే 31వ తేదీన మొదటిరోజు అమ్మవారు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా చివరి మూడు రోజులు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు గజవాహనం, జూన్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు చేపడతారు.
తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
Also Read..
India Corona | 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 12 మరణాలు
Delhi School | ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపులు
Amazon Layoffs | అమెజాన్లో 9 వేల మందిపై వేటు.. భారత్లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం