BRS | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉన్నదని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి తోట చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్లు ఎంతో మంది బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. దేశం గుణాత్మక మార్పు చెందాలని, ఉజ్వల భారతం కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అద్భుత రోడ్మ్యాప్ను రూపొందించారని చెప్పారు. కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి అతిస్వల్ప కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఏపీతోపాటు అన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు.