తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి సమావేశం చైర్మన్ కరుణాకర రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. సుమారు 15 వేల మందికి జీతాలను(Wages) పెంచుతూ బోర్లు తీర్మానం చేసింది. వీరికి రూ.3వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పెరుగుతుందని చైర్మన్ కరుణాకర రెడ్డి(Chairman Karunakar Reddy) వెల్లడించారు.
పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల మంది కాంట్రాక్టు, సొసైటీ, సంభావన ఉద్యోగులకు (Employees) జీతాలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏండ్ల ఇంటి స్థలాల కలను నిజం చేసి ఇంటి స్థలాలు(House Sites) పంపిణీ చేయించారు. మిగిలిన 9 వేల 750 మందికి కూడా వారి కేడర్, సీనియారిటీ ని బట్టి జీతాలు పెంచుతూ సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఉద్యోగుల క్యాంటీన్లో భోజనం
టీటీడీ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాయిస్ క్యాంటీన్లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరలతో అల్పాహారం, భోజనం అందించడానికి సమావేశం నిర్ణయం తీసుకుంది.
మరికొన్ని నిర్ణయాలు :
– టీటీడీ ఆధ్యర్యంలో యేట ఫిబ్రవరి 24న తిరుపతి పుట్టినరోజు పండుగ నిర్వహణ
– టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీశ్రీనివాస మ్యాన్పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి, వారి వేతనాలు పెంచి, బస్సు పాసులు ఇచ్చేందుకు ఆమోదం
– తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.3.89 కోట్లతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా లైటింగ్ ఏర్పాటు
– శ్రీలంకలోని కొలంబో పుట్టాలం జిల్లాలో వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం. శ్రీలంకలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించేందుకు నిర్ణయం.
– లడ్డూప్రసాదాల తయారీకి శ్రీవారి పోటులో అదనంగా మరో 15 మంది పోటు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం
– తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార, ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుకు రూ.3.15 కోట్లు
– తిరుపతిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం.
– టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ సిద్ధాంతి పదవీ కాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగింపు
– జమ్మూలో నిర్మించిన శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏ పెంపు