అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే, వారం రోజులకు వాయిదా వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షల తేదీలను ఏపీ ఇంటర్మీడియ్ బోర్డ్ రీ షెడ్యూల్ చేసింది. దాంతో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరుగుతాయి. పదవ తరగతి పరీక్షలు మే 2 నుంచి 13 వరకు జరిపేందుకు ఇప్పటికే విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. అయితే, ఒకేసారి ఇంటర్మీడియట్, పది పరీక్షలు నిర్వహణ కష్టసాధ్యం అవుతుందనే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది.
ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు, పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేషన్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాల ఏర్పాటు వంటి సమస్యలు ఎదురు కానున్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు గ్రహించారు. దాంతో పరీక్షల విభాగం స్పందించి పదవ తరగతి కొత్త షెడ్యూల్ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపింది. కాగా, పదవ తరగతిలో తొలిసారిగా 7 పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో పరీక్షల మార్పు అనివార్యమని తెలుస్తున్నది.
అదేవిధంగా, రాష్ట్రంలో ఒంటిపూట బడులను ప్రభుత్వం వాయిదా వేసింది. సాధారణంగా ఒంటిపూట బడులు మార్చి 15 నుంచే ప్రారంభం అవుతాయి. కరోనా కారణంగా ఆగస్టు 16 నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. దాంతో తరగతులు పూర్తిగా జరుగలేదు. సిలబస్ ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా ఒంటిపూట బడులను మార్చి నెలకు బదులుగా ఏప్రిల్ నెలలో అమలు చేసేలా ప్రభుత్వం భావిస్తున్నది.