Godavari | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సీతారామ ఎత్తిపోతల పథకం-సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుపై ఏపీతోపాటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అసంబద్ధమని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. అవన్నీ పచ్చి అబద్ధాలని నిర్దంద్వంగా కొట్టిపారేసింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) తెలంగాణ ప్రభుత్వం తాజాగా వివరాణాత్మక లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వం జనవరిలోనే సీడబ్ల్యూసీకి సమర్పించింది. దానిపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా జీఆర్ఎంబీని సీడబ్ల్యూసీ ఆదేశించింది. అదే సమయంలో ఆ డీపీఆర్ను పరిశీలించవద్దని కోరుతూ జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీకి ఏపీ లేఖలు రాసింది. వాటిని ఆధారాలతో సహా కొట్టిపారేస్తూ తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాసిన తెలంగాణ.. ఏపీ వాదనలన్నీ అసంబద్ధమేనని, నిరాధారమని తేల్చిచెప్పింది. ఏపీ అభిప్రాయాలనే జీఆర్ఎంబీ తన అభిప్రాయాలుగా పంపిందని మండిపడింది.
గోదావరిలో ఏపీకి 770 టీఎంసీల వాటా లేదని, కేవలం 518 టీఎంసీల వాటా మాత్రమే ఉన్నదని నొక్కిచెప్పింది. ఆ విషయాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా వెల్లడించిందని గుర్తుచేసింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా, రాష్ర్టాలవారీగా వాటాలను కేటాయించలేదని, గోదావరి జలాలను నిర్దిష్ట క్యాచ్మెంట్ ఏరియాలు, సబ్బేసిన్లవారీగా ఏ మేరకు వినియోగించుకోవాలన్న విషయాన్ని మాత్రమే నిర్దేశించిందని తెలంగాణ స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ర్టాలు చేసుకున్న ఒప్పందాలనే ట్రిబ్యునల్ అవార్డుగా ప్రకటించిందని తెలిపింది. ఆ లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీకి 1,485 టీఎంసీలు దక్కాయని గుర్తుచేసింది. అందులో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరుపుతూ జారీచేసిన జీవోల ప్రకారం ఏపీకి 518 టీఎంసీలు, తెలంగాణకు 967 టీఎంసీలు దక్కినట్టు స్పష్టం చేసింది. ఆ వాటాల ఆధారంగానే సీడబ్ల్యూసీ సమ్మక్కసాగర్, సీతారామ, మోడికుంట ప్రాజెక్టులకు హైడ్రాలజీ అనుమతులను మంజూరు చేసినట్టు తెలిపింది.
గోదావరిలో నీటిలభ్యతకు సంబంధించి ఏపీ పదే పదే ఉటంకిస్తున్న వ్యాప్కోస్ రిపోర్టును సీడబ్ల్యూసీ ఎన్నడూ గుర్తించలేదని తెలంగాణ నొక్కిచెప్పింది. అయినప్పటికీ ఏపీ కావాలనే పదే పదే నీటి వాటాలపై అసంబద్ధ వాదనలు చేస్తూ సీడబ్ల్యూసీని తప్పుదోవ పట్టించేందుకు, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తింది. ఇవేవీ పట్టించుకోకుండా ఏపీ
తెలిపిన అభిప్రాయాలనే తన అభిప్రాయాలుగా జీఆర్ఎంబీ పేర్కొంటూ సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వడాన్నీ తెలంగాణ దుయ్యబట్టింది. ఏపీ, జీఆర్ఎంబీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతులను మంజూరుచేయాలని కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) విజ్ఞప్తి చేసింది.