అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది. సోమవారం చీఫ్ సెక్రటరీకి నోటీసు ఇస్తామని 12వ తేదీన జరిగిన సమావేశంలో సుమారు 34 సంఘాలతో ఏర్పాటైన వేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సోమవారం సిఎస్ కార్యాలయానికి వేదిక నాయకులు వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ముఖ్యమంత్రి కార్యాలయంలో వేర్వేరు సమీక్షలు ఉండటంతో అక్కడకు వెళ్లినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక మెయిల్ ద్వారా కార్యాచరణ నోటీస్ పంపారు.
ఈరోజు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ను వ్యక్తిగతంగా కలిసి ఇవ్వాలని నిర్ణయించారు. పిఆర్సీ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ నాలుగు జెఏసిల స్టీరింగ్ కమిటీ చర్చలు జరిపినా పిఆర్సిలో న్యాయం జగరలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రకటించి, స్టీరింగ్ కమిటీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం అన్ని సంఘాలతో కలిసి పిఆర్సిలో న్యాయం కోసం ఆందోళన చేపట్టారు. వీరికి పలు ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, న్యాయ విభాగ సిబ్బందితోపాటు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులూ కలిసి వచ్చారు.
సుమారు 34 సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశారు. ఆయా సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అక్కడికక్కడే కార్యాచరణ ప్రకటించారు. ఓపెన్ బ్యాలెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతులు ఇవ్వడంతోపాటు జిల్లాస్థాయి లోనూ, రాష్ట్రస్థాయిలోనూ వేర్వేరుగా దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలుస్తామని, తమ అభ్యర్ధనను ఆయనకు తెలియచేస్తామని వారు పేర్కొన్నారు.